10, జులై 2013, బుధవారం

కొండల్లో .....బౌద్ధం

కొండల్లో అలరారిన బౌద్ధం
భారతదేశంలో బౌద్ధమతానికి సంబంధించిన ఆరామాలు, చైత్యాలు, విహారాలు అనేకం ఉన్నారుు. మనరాష్ట్రంలో కూడా వీటి సంఖ్య ఎక్కువే... అమరావతి, గుంటుపల్లి వంటి అనేక బౌద్ధ క్షేత్రాలున్నారుు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఇలాంటి బౌద్ధ క్షేత్రాలకు కొదువలేదు. వాటిలో అత్యంత పురాతన, ఎంతో చారిత్రక విశిష్టత కలిగిన మూడు బౌద్ధ క్షేత్రాలే... పావురాళ్ళకొండ, బావికొండ, తొట్లకొండ... ఈ విశిష్ట బౌద్ధ విహారాల సమహారామే ఈవారం ‘విహారి’...

బావికొండ బౌద్ధవిహారం
విశాఖపట్నం నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఉన్నది బావికొండ బౌద్ధ సముదాయం. కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వచేసుకోవటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దానికి చెందినది. ఇక్కడ జరిగిన తవ్వకాలలో ఒక పెద్ద బౌద్ధ సముదాయం బయటపడింది. ఒక మట్టి కలశంలో ఒక ఎముక ముక్క కూడా దొరికింది. ఇది బుద్ధుని భౌతిక అవశేషమని భావిస్తున్నారు. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణేలను కూడా రాష్ట్ర పురాతత్వశాఖ వారు సేకరించారు.


తొట్లకొండ
బౌద్ధమతంపై పెద్దయెత్తున ప్రచారం జరుగుతున్న రోజులవి. అంటే సుమారు రెండువేల సంవత్సరాల క్రితం. భీమిలి కేంద్రానికి సమీపంలో బౌద్ధరామం నిర్మించారు. ఈ బౌద్ధరామం ఉన్న ప్రాంతం నేడు తొట్లకొండగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ తొట్లకొండ బౌద్ధ సముదాయం కూడా విశాఖపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో, భీమునిపట్నం బీచ్‌కు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల లోపల తిమ్మాపురం ప్రాంతానికి ఆగ్నేయ దిశలో ఈ ప్రాంతం ఉంది.

ఈ దారిలో సముద్రతీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తయిన ఒక కొండపై ఉన్నది. కొండపై వర్షపు నీటిని సేకరించడానికి రాతిలో తొలచిన అనేక తొట్లు ఉండటం వలన తొట్లకొండ అని పేరు వచ్చింది. తొట్లకొండ ప్రాచీన కళింగ ప్రాంత ప్రభావంలో ఉండి ఇక్కడ నుండి బౌద్ధ సంస్కృతి శ్రీలంక, తదితర ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించేందుకు ప్రధాన కేంద్రంగా దోహదం చేసింది. తొట్లకొండ, భారతీయ సంస్కృతి ముఖ్యంగా బౌద్ధం ఖండాంతర ప్రదేశాలకు ప్రసరించిన పద్ధతికి అద్దంపడుతుంది.

సముద్ర తీరానికి అతి చేరువలో లోతైన గుహాలు కలిగివున్న ప్రాంతం, ప్రకృతి సౌందర్యానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. మానవాళి మెచ్చుకునే ఈ తొట్లకొండ నాటి బౌద్ధమతావలంబీకులను ఎంతో ఆకర్షించేదట. అందుకే అప్పట్లో వారంతా ఈ కొండను విహారకేంద్రంగా భావించేవారని చరిత్ర చెబుతోంది. ఇక్కడి లోతనైన సముద్రతీరం నౌకలకు లంగరు వేయడానికి అనువుగా తోడ్పడేది. తూర్పు తీరంలో తగిన నావికా కేంద్రం ఏర్పాటు చేయడం కోసం భారత నౌకాదలం ఏరియల్‌ సర్వే నిర్వహింస్తున్న సందర్భంలో నేటి తొట్లకొండ ప్రత్యేకంగా కనిపించింది. అనంతరకాలంలో ఇక్కడ బౌద్ధరామం ఉన్నట్లు కనుగొన్నారు.

ఆ తరువాత కాలంలో ఆర్కియాలజీ, మ్యూజియం శాఖలు దీనిపై అనేక పరిశోధనలు నిర్వహించి ధెరనాడ (హీన యాన బౌద్ధమతం)కు చెందిన ఆయలంగా గుర్తించారు. నాటి రాతి రహదారులు, అనేక చైతన్య గృహాలు, వంటశాలు, భోజనశాలలు చరిత్రకు సాక్షాలుగా నిలిచాయి. ఈ ఆనవాళ్లుతో పాటు ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతి పరికరాలు, పనిముట్లు, రాతి బోమ్మలు, రాతి స్థూపాలు, శాతవాహన, వెండి నాణేలు లభించాయి. ఈ ఆనవాళ్లు ఆధారంగానే తొట్లకొండపై నాడు బౌద్ధరామం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక్కడి నిర్మాణాలు కేవలం క్రీస్తు పూర్వ మూడో శతాబ్ధం నుంచి క్రీస్తు శకం మూడో దశాబ్ధం మధ్య కాలంలోనే జరిగాయని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీస్తు శకం మూడో దశాబ్ధం నుంచి హీన యాన బౌద్ధ మత ప్రభావం తగ్గడంతో బౌద్ధరామ శిల్పాలు మరుగున పడినట్టు తెలుస్తోంది. ఇక్కడ నీటిని నిల్వచేసే భారీ తొట్లెలు కనిపిస్తాయి. బౌద్ధులకు చెందిన స్థూపాలు, చెత్య గృహాలు, సమావేశ మందిరాలు వంటి వాటికి చెందిన అవశేషాలు ఇక్కడి తవ్వకాల్లో వెలుగుచూశాయి.

బీచ్‌ తీరం వెంబడి భీమిలికి వెళ్ళే దారిలో కైలాసగిరి, ఋషికొండ సాగర్‌నగర్‌, గీతమ్స్‌, రిసార్ట్లు, కొత్తగా కడుతున్న రామానాయుడు స్టూడియో దాటాకా తొట్లకొండ వస్తుంది. కొంత దూరం పైకి వెళ్ళగానే కుడిపక్కన మనవాళ్ళు నిర్మించిన ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహం, దాని ముందు చిన్న ఫౌంటైన్‌ కనిపిస్తాయి. కోండపైకి వెళితే అక్కడ ఒక హోర్డింగ్‌ కనిపిస్తుంది. దాని మీద ప్రదేశం గురించిన వివరాలు మ్యాప్‌తో సహా ఉంటాయి. ఆ మ్యాపులో చూపించిన చైత్యాలు, స్తూపాలు, సముదాయాలు అన్నీ (అంటే శిథిలాలు) కనిపించవు. ఓ పావు భాగం మాత్రమే మనం చూడగలుగుతాం.

చారిత్రక బౌద్ధ క్షేత్రాలకు నిలయమైన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యతను, ప్రాచుర్యాన్ని సాధిస్తున్న తొట్లకొండ భారతదేశంలోనే సుప్రసిద్దమైన బౌద్ద క్షేత్రంగా పేరుగాంచింది. సాగరతీరంలో వెలసిన ఏకైక బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండను మిక్కిలి ప్రజాదరణ కలిగిన సందర్శనా స్థలంగా తీర్చిదిద్దాలంటూ బెంగుళూరు కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్న మహాబోధి సొసైటీ ప్రతినిధులు కొన్నాళ్ళక్రితం వుడా విసిని కలిసి ప్రతిపాదన సమర్పించారు.

బౌద్ధ సాంస్కృతిక కేంద్రం, ధ్యానకేంద్రం, బౌద్ధ పరిశోధనా కేంద్రం, బౌద్ధారామాన్ని పోలిన విశేషాలు, థీమ్‌ పార్క్‌, వీటన్నింటికీ తోడు ప్రకృతిని సాక్షాత్కరింపజేసే పచ్చదనాన్ని పెంపొందించడం వంటి కార్యాచరణ ప్రణాళికల్ని ప్రతిపాదనలో చేర్చారు. హైదరాబాద్‌లోని ఆనంద బుద్ధ విహార తరహాలో తొట్లకొండను సమగ్రంగా తీర్చిదిద్దడం ద్వారా ప్రముఖ సందర్శనా స్థలంగా మార్చనున్నారు. వారసత్వ సంపదకు నిలయంగా ఉన్న తొట్లకొండపై మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని కారణంగా సందర్శకులు అధిక సంఖ్యలో రాలేకపోతున్నారనేది
వాస్తవం.


పావురాళ్ళకొండ
స్థానికంగా నరసింహస్వామి కొండగా పిలుచుకునే పావురాళ్ళకొండ లేదా పావురాళ్ళబోడు విశాఖపట్టణానికి 25 కిలోమీటర్లు ఉత్తరాన భీమునిపట్నం వద్ద ఉన్నది. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉన్నది. బౌద్ధ విహారం యొక్క శిధిలాలు అనేక ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దం నుండి క్రీస్తుశకం రెండవ శతాబ్దం వరకు జనవాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి.
1990-91లో జరిగిన తొలివిడత తవ్వకా ల్లో అనేక అవశేషాలు లభ్యమయ్యాయి. రెండు బ్రాహ్మీ లిపి సూచక శాసనాలు, విహారాల యొక్క పునాదులు, వృత్తాకార చైత్యాలు, మొక్కుబడి స్థూపాలు, హాలులు తదితరాలు ఈ శిధిలావస్థలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఈ ప్రదేశం నుండి నాణేలు, మెరుగుబెట్టిన పాత్రలు, పూసలు మొదలైన వస్తువులను సేకరించారు. ఈ కొండపై వర్షపునీటిని నిలువచేసుకోవటానికి రాతిలో చెక్కిన దాదాపు పదహారు తొట్లను కనుగొన్నారు. ఇలాంటి తొట్ల వల్లే పేరు సంతరించుకొన్న బావికొండ, తొట్లకొండల కంటే ఎక్కువ తొట్లు ఇక్కడే ఉండటం విశేషం.
ఈ క్షేత్రానికి సమీపంలో గోస్తనీ నది ప్రవహిస్తున్నది. ఇక్కడి నుండి సముద్రతీరం దృశ్యం కూడా అందంగా ఉంటుంది. విశా ఖపట్నం జిల్లాలోని ఇతర బౌద్ధ క్షేత్రాలైన బావికొండ, తొట్లకొండలకు పావురాళ్ళ కొండ క్షేత్రం కూడా సమకాలీనమైనది.
2012 వేసవిలో జరిగిన తవ్వకాల్లో ఒక విహారం, ఒక వరండా ఇక్కడ బయల్ప డ్డాయి. బౌద్ధ క్షేత్రాలలో తరచుగా కనిపించే అర్ధచంద్రాకారపు శిలలు విహారాలలో అడుగుపెట్టే స్థలంలో స్వాగతం పలుకుతు న్నాయి. ఒక నాగ శిల్పం, ధాన్యం నిలువ చేసుకోవటానికి ఉపయోగించిన ఒక పెద్ద కుండ, చిన్నకుండ, శిలాస్థంబాల మండ పాలు, అవశేషపు భోషాణం, ఒక రోమన్‌ నాణేం, రెండు శాతవాహన నాణేలు, పుష్ప ఫలకాలు ఇప్పటివరకు లభ్యమైన వస్తువుల లో కొన్ని. తీరానికి దగ్గర ఉండటం వళ్ల ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలతోనే కాక విదేశాలతో కూడా వర్తక సంభందాలు ఉండేవని తెలుస్తున్నది.
ఈ చారిత్రక స్థలం డచ్చి వారి అతిధిగృహం నిర్మించడం వళ్ల పాక్షికంగా మార్పుచెందినది. జీర్ణావస్థలో ఉన్న అతిధిగృహంలో ఎలాంటి శాసనాలు దొరకలేదు. కానీ గోడ లు మాత్రం పటిష్టంగానే ఉన్నాయి. బౌద్ధ క్షేత్ర నిర్మాణంలో ఉపయోగించిన కొన్ని ఇటుకలు ఈ డచ్చి అతిధిగృహం నిర్మాణం లో పునరుపయోగించినట్టు తెలుస్తున్నది.
పావురాళ్ళకొండలో ఇప్పటివరకు నాలుగు శాసనాలు లభ్యమయ్యాయి. అందులో ఒకటి క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దానికి చెందినదైతే మిగిలిన మూడు శాసనాలు క్రీస్తుశకం ఒకటి నుండి రెండవ శతాబ్దానికి చెందినవి. చివరి మూడింట్లో ఒకటి పాల అనే గ్రామవాసులు బౌద్ధ ఆరామానికి ఛత్రం, తొట్టి మరియు మండపం దానం చేసిన విషయం ప్రస్తావిస్తుంది. మిగిలినవి అనేక బౌద్ధ సన్యాసుల పేర్లు పేర్కొంటున్నవి.
పావురాళ్ళకొండ అనగానే పావురాలు ఉండే కొండ అని అనుకోవటం పరిపాటే కానీ ఈ కొండపై జరిపిన కొన్ని అధ్యయనాల వల్ల ఇక్కడ లభ్యమయ్యే తెల్ల రాళ్లను స్థానికులు పావురాళ్ళు అంటారు. అవి కొండపై ఉండటం వళ్ల పావురాళ్ళకొండ అయి ఉండవచ్చు. అయితే ఈ పేరు వ్యవహారం మరింతగా పరిశోధించవలసి ఉన్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి