24, డిసెంబర్ 2012, సోమవారం

ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు


అమరావతి స్తూపంపై చెక్కిన పద్మం
బౌద్ధమతం ఆరంభ దశనుండి ఆంధ్ర ప్రదేశ ప్రాంతలో విశేషమయన ఆదరణ పొందింది. అశోకునికి ముందే, అనగా బుద్ధుని కాలం నుండే ఆంధ్రదేశంలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదని పెక్కు ఆధారాల వల్ల తెలియవస్తుంది. బౌద్ధ ధర్మం ఆంధ్ర జాతిని9 సమైక్య పరచి వారి కళానైపుణ్యానికి, సృజనా సామర్ధ్యానికి, నిర్మాణ నైపుణ్యానికి, తాత్విక జిజ్ఞాసకు అపారమైన అవకాశం కల్పించింది. సుప్రసిద్ధ దార్శనికులు అయిన నాగార్జునుడు, ఆర్యదేవుడు, భావవివేకుడు, దిజ్ఞాగుడు వంటి వార్లకు ఆంధ్రదేశం నివాసభూమి అయ్యింది. థేరవాదులకు మగధవలె మహాయాన బౌద్ధులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థలం అయ్యింది.[1]
తూర్పున శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం నుండి ప్రకాశం జిల్లాలోని రామతీర్ధం వరకు, పడమర కరీం నగర్ జిల్లా ధూళికట్ట నుండి వైఎస్ఆర్ జిల్లా ఆదాపూర్ వరకు ఆంధ్రదేశం నలుమూలలో అనేక బౌద్ధ క్షేత్రాలు వెలశాయి. క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 వరకు, 600 సంవత్సరాలు ఆంధ్రావనిలో జీవితం ప్రగాఢంగా బౌద్ధం ప్రభావంలో ఉంది. కుల వ్యవస్థ లోని దురభిమానం ఆనాటి శాసవాలలో కానరాదు. విధికుడు అనే చర్మకారుడు సకుటుంబంగా అమరావతి స్తూపాన్ని దర్శించి బహుమతులు సమర్పించినట్లు అక్కడి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో వర్తకం, వ్యవసాయం, వృత్తిపనులు సర్వతోముఖంగా విస్తరించాయని అనేక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.
ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్తూపాలున్న ముఖ్య క్షేత్రాలు.


బౌద్ధం ఆరంభ కాలంలో

విజయనగరం జిల్లాలోని రామతీర్థం వద్ద గురబక్తుల కోండ పై బౌద్ధారామం శిధిలావశేషాలు
తిపిటకాలలో పురాతన భాగమైన "సుత్త పిటకం" ప్రకారం "అస్సక" రాజ్యానికి (ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ప్రాంతం) తథాగతుని కాలంలోనే బౌద్ధం ప్రవేశించింది. గోదావరి తీరాన ఆశ్రమంలో ఉండే "బావరి" అనే సాధువు ఉత్తర దేశాన బుద్ధుని ఉదయం గురించి తెలిసికొని ఒక శిష్యుని అక్కడికి పంపాడు. బావరికి, బుద్ధునికి జరిగిన సంవాదం "సుత్త పిటకం"లో చెప్పబడింది. ఆ శిష్యుడే బుద్ధుని బోధనలను ఆంధ్రదేశానికి తీసికొని వచ్చాడు. క్రీ.పూ. 5వ శతాబ్దం నుండి రమామరమి క్రీ.శ.14వ శతాబ్దం వరకు బౌద్ధం ఆంధ్రదేశంలో ఆదరణ పొందింది. [2]

అశోకుడు "మొగలిపుత తిస్స" అధ్వర్యంలో నిర్వహించిన మూడవ బౌద్ధ మండలికి ఆంధ్రదేశంనుండి ఆరు సంప్రదాయాలకు చెందిన ప్రతినిధులు (చైత్యకులు, పూర్వశైలురు, అపరశైలురు, ఉత్తర శైలురు, రాజగిరికులు, సిద్ధార్థికులు) వెళ్ళారు. మౌర్య సామ్రాజ్యం పతనమైనాక దక్కనులో శాతవాహనులు, ఉత్తరాన కుషాణులు బౌద్ధాన్ని ఆదరించారు. అశోకుని శిలాశాసనం ప్రకారం ఆంధ్ర దేశం అప్పటికే "ధర్మవిషయం"లో ఉంది. గుంటుపల్లి, భట్టిప్రోలు, పావురాలకొండ, బావికొండ, తొట్లకొండ వంటి బౌద్ధ క్షేత్రాలు హీనయాన బౌద్ధం కాలం నాటివి. (క్రీ.పూ. 300 నాటివి.) విశేషించి భట్టిప్రోలును బుద్ధుడే స్వయంగా సందర్శించాడని ఒక అభిప్రాయం ఉంది (బుద్ధుని జీవిత కాలంలో దక్షిణ భారతానికి రాలేదు అన్న అభిప్రాయం కూడా ఉంది). భట్టిప్రోలులోని ధాతు కరండం బుద్ధుని శరీర ధాతువులకు చెందినది కావచ్చును. అశోకుని కాలంలోను, తరువాత శాతవాహనుల కాలంలోను బౌద్ధాన్ని రాజకుటుంబాలు విశేషంగా ఆదరించారు. రాజుల హిందూమతావలంబులైనా గాని రాణివాసం బౌద్ధ సంఘాలకు పెద్దయెత్తున దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ఉత్తర హిందూస్తానానికి, శ్రీలంకకు మధ్య జరిగిన బౌద్ధ పరివ్రాజకుల రాకపోకలలో వేంగిదేశం ముఖ్యమైన మార్గం మరియు కూడలిగా ఉండేది.[3]

మహాయాన కాలం

అమరావతి స్తూపం నమూనా
మహాయానానికి ఆంధ్రదేశం జన్మస్థలం అనవచ్చును. ఇక్కడినుండి "మాధ్యమిక వాదం" లేదా "శూన్యవాదం" సిద్ధాంతకారుడు నాగార్జునుడు మహాయానానికి ఊపిరి పోశాడు. ఆర్యదేవుడు (మాధ్యమిక వాదం వ్యాఖ్యాత), బుద్ధపలితుడు (మాధ్యమిక వాదంలో ప్రసంగిక సంప్రదాయానికి ఆద్యుడు), భావవివేకుడు (స్వతంత్రిక సంప్రదాయం గురువు), దిజ్ఞాగుడు (బౌద్ధ మీమాంస కారుడు) , ధర్మకీర్తి (తర్కంలో నిష్ణాతుడు) తరువాతి మూడు శతాబ్దాలలోను బౌద్ధానికి దీపస్తంభాలలా నిలచారు. థేరవాద సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన బుద్ధఘోషుడు 4వ శతాబ్దంలో పలనాడు ప్రాంతలో జన్మించాడు. త్రిపిటకాలపై అతని "విశుద్ధి మాగ్గ" అనే భాష్యం థేరవాదంలో అనన్యమైన గౌరవం కలిగి ఉన్నది.
బావికొండ మహా స్తూపం
ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్ననాటి చిహ్నాలు. ఆంధ్రదేశంలో కృష్ణాతీర వర్తకులు విదేశాలతో విరివిగా వ్యాపారం సాగించారు. తమ సంపదను బౌద్ధధర్మం అదరణకు విరివిగా వెచ్చించారు. ఆంధ్ర దేశంలో బౌద్ధాన్ని అధికంగా వర్తకులు మరియు సామాన్య జనం విశేషంగా ఆదరించారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు వంటి పాలకులు వైదిక మతావలంబులైనా గాని బౌద్ధాన్ని కూడా కొంతవరకు ఆదరించారు. వారి రాణివాసజనం చాలామంది మాత్రం బౌద్ధం పట్ల యెనలేని ప్రేమతో విశేషంగా ఆరామాలకు దానాలు చేశారు. నాగార్జునుని కాలంనుండి మహాయానం విశేషంగా ఆంధ్రదేశంలో వర్ధిల్లింది. వజ్రయానం కూడా కొంతవరకు ఆదరింపబడినప్పటికీ అప్పటికే వైదికమతం పుంజుకోవడంతో బౌద్ధం క్షీణించసాగింది.

స్తూపాలు, చైత్యాలు

భట్టిప్రోలు స్తూపం శిధిలావశేషాలు
బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివశిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్తూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్తూపాలలో మూడు రకాలున్నాయిః
ధాతుగర్భ స్తూపాలు: బుద్ధునివి గాని, ప్రముఖ ఆచార్యులని గాని అయిన అవశేషాలపై నిర్మించినవి.
పారిభోజిక స్తూపాలు: భిక్షాపాత్ర వంటి వస్తువులపై నిర్మించినవి.
ఉద్దేశిక స్తూపాలు: ధాతువులు లేకుండా స్మారకచిహ్నంగా నిర్మించినవి.
బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి అశోకుడు అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. ఈ ప్రతీతిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు. కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్తూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి. అసంఖ్యాకమైన అటువంటి స్తూపలు ఆంధ్రదేశంలో ఎన్నో కనుగొనబడ్డాయి. వీటిలో అధికంగా కృష్ణాతీరంలో ఉన్నాయి. ఆ ప్రాంతం ఐశ్వర్యవంతమైనది మరియు అక్కడి (నాగ, యక్ష జాతి) ప్రజలు బౌద్ధాన్ని విశేషంగా ఆదరించడం అందుకు కారణాలు.

కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలు

చందవరం బౌద్ధచైత్యం శిలాఫలకంమీద ఒక స్తూపం నమూనా
ఫణిగిరి త్రవ్వకాలలో లభించిన శిల్పఫలకం
భట్టిప్రోలు, గుంటుపల్లి, జగ్గయ్యపేట, అమరావతి (ధరణికోట), నాగార్జునకొండ, వేంగి వంటివి ఇటువంటి కొన్ని ముఖ్యక్షేత్రాలలోనివి.
అన్నింటిలోకి భట్టిప్రోలు అతి ప్రాచీన మైనది. క్రీ.పూ.3వ శతాబ్దిలో కుబేరుడు (కుబ్బీరకుడు) అనే రాజు కాలంలో ఇచట మహాచైత్యాన్ని నిర్మించారు. "బుద్ధ శరీరాణి మహానీయాని శర్మణే", "బుద్ధశరీరాణి నిక్షేప్తుం" అనే శాసనాలవలన ఈ చైత్యం బుద్ధుని శరీరధాతువుపైనే నిర్మించబడినట్లు భావిస్తున్నారు. గుంటుపల్లి కూడా దాదాపు భట్టిప్రోలు సమకాలికమైనదే. ఇక్కడ కొండమీద చైత్యగృహం, ఆరామమంటపాలు, స్తూపాలు ఉన్నాయి. ఈ తీర్ధం పెక్కు భక్తులను ఆకర్షించేదనడానికి ఇక్కడ ఉన్న పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం.

దక్షిణాపధ బౌద్ధ క్షేత్రాలన్నింటికీ అమరావతి తలమానికమైనది. దీని అప్పటిపేరు ధనకటక లేదా ధాన్యకటకం లేదా ధరణికోట. ఇక్కడ దొరికిన మౌర్య లిపి శాసనాల ఆధారంగా దీని నిర్మాణం అశోకుని కాలంలో జరిగిఉండవచ్చును. అశోకుడు దక్షిణాపధానికి పంపిన బౌద్ధభిక్షువు మహాదేవుడు అమరావతి కేంద్రంగానే తన ధర్మ ప్రచారం సాగించి ఉండవచ్చును. నాగార్జునుని మహాయానకాలంలో అమరావతి బౌద్ధవిజ్ఞానానికి పీఠమై జగద్విఖ్యాతమయ్యింది. చైనా యాత్రికుడైన హ్యూన్ త్సాంగ్ తాను ధాన్యకటక విహారంలో అభిధమ్మపిటకాన్ని అభ్యసించినట్లు వ్రాసుకొన్నాడు. ఇక్కడి మహాచైత్యం ఆంధ్రుల నిర్మాణ చాతుర్యానికి, శిల్పకౌశల్యానికి గీటురాయి.

కృష్ణానదీ తీరాన వెలసిన మరొక ఆరామస్థానం జగ్గయ్యపేట అప్పటిలో "ఎలగిరి" అనబడేది. క్రీ.పూ.2వ శతాబ్దిలొనే ఇక్కడ మహాచైత్యవిహారాదులు వెలశాయి. ఇక్కడి పుణ్యశాలా శిల్పంలో మహాబలిపురం రాతిరధాలను, అజంతా చిత్రాలను పోలిన రీతి ఉంది. మహాయాన సిద్ధాంతకర్త ఆచార్యనాగార్జునుని స్థానమైన శ్రీపర్వతంలోని మహాచైత్యవిహారాలు కూడా బుద్ధధాతువుపైనే నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. ఇక్కడి విహారాన్ని "పారావత విహారం" అని చైనా యాత్రికుడు ఫాహియాన్ పేర్కొన్నాడు. ఇక్కడ ఐదంస్తులం భవనంలో పెద్ద గ్రంధాలయం ఉండేది. సింహళదేశపు యాత్రికులకోసం ప్రత్యేక విహారాలుండేవి. ఇక్కడినుండి మహాయానం చైనా, టిబెట్ వంటి దేశాలకు వ్యాపించింది.
వేంగిని హ్యూన్‌త్సాంగ్ "పింగ్-కీ-లో" అని వ్రాశాడు. ఇక్కడ అచల అర్హతుడు ఇరవై సంఘారామాలు నిర్మించాడని, వాటిలో మూడువేల బౌద్ధ భిక్షువులుండేవారని వ్రాశాడు. ఇక్కడ చైత్యగృహంలో జనబోధిసత్వుడు నివశిస్తూ తర్కశాస్త్రం వ్రాశాడట. ఆ జనబోధిసత్వుడే దిజ్ఞాగుడు అని చరిత్రకారులు భావిస్తున్నారు.

వజ్రయాన కేంద్రాలు: ఉత్తరాంధ్ర తీరంలోని రామతీర్ధం, శాలిహుండం, బొజ్జన్నకొండ, సంఘరం వంటి క్షేత్రాలలో వజ్రయానపు చిహ్నాలు ఎక్కువగా కనిపిస్తాయి. కళీంగపట్నం రేవునుండి వజ్రయానం సుమత్రాదీవులకు పయనించి ఉండవచ్చును. సంఘరం అసలు పేరు సంఘారామం కావచ్చును. ఆరామతీర్ధం రామతీర్ధంగా పరిణమించి ఉండవచ్చును. ‍‌బొజ్జన్నకొండలోని లింగాలమెట్టయే బోరోబదూరు బౌద్ధక్షేత్రానికి నమూనా అయ్యిందని ఒక అభిప్రాయం

ఇవే కాకుండా గుమ్మడిదుర్రు, గుడివాడ(కృష్ణా జిల్లా), ఘంటసాల, విద్యాధరపురం, బుద్ధాం, చినగంజాం, ఫణిగిరి, కొండాపూర్, ముంజలూరు, కుమ్మరిలోవ, తగరపువలస(గుడివాడ దిబ్బ) సరిపల్లి, వంటి అనేక క్షేత్రాలు కనుగొనబడ్డాయి. అమరావతితో సహా పంచారామాలు మొదట బౌద్ధ క్షేత్రాలుగా ఉండేవని ప్రతీతి.,

ముఖ్యమైన క్షేత్రాల జాబితా

క్రీ.పూ. 3వ శతాబ్ది నుండి క్రీ.శ. 14వ శతాబ్దం వరకు బౌద్ధమతారాధనలో వివిధ దశలను సూచించే 140 కి పైగా బౌద్ధక్షేత్ర స్థలాలను ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. వీటిలో లభించే లిఖిత ఆధారాలు మొత్తం 501 (360 శిలా శాసనాలు, 7 రాఘి రేకులు, 134 కుండలు, శంఖాలవంటి వస్తువులపై వ్రాసినవి). ఈ కాలంలో ఆంధ్రదేశంలో జీవనం, కళ, సంస్కృతి బౌద్ధంవల్ల బలంగా ప్రభావితమయ్యాయి. అంతకు ముందు జాతులు, తెగల మధ్యనున్న అగాధాలు పూడుకుపోయి సంస్కృతిలో క్రొత్త బాటలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమరావతి, వాగార్జునకొండ వంటి చోట్ల శిల్పకళ, విద్యాధ్యయనం ప్రభవించాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో 14 ధాతుపేటికలు లభించాయి. ఇవి ఏ ఇతర రాష్ట్రంలో లభించిన వాటికంటే ఎక్కువ.
గుంటుపల్లి స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్‌లోని బౌద్ధమతపు శిధిలాలు లేదా చిహ్నాలు ఉన్న స్థలాలు క్రింద ఇవ్వబడ్డాయి.
శ్రీకాకుళం జిల్లా
విజయనగరం జిల్లా
విశాఖపట్నం జిల్లా
తూర్పు గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా
ఖమ్మం జిల్లా
కృష్ణా జిల్లా
నల్గొండ జిల్లా
కరీంనగర్ జిల్లా
నిజామాబాద్ జిల్లా
  • పశిగం
  • వడ్డమణి
కర్నూలు జిల్లా
  • బెలుం గుహలు
  • జొన్నగిరి (ఆశోకుని శిలాశాసనాలు)
  • రాజులమందగిరి (ఆశోకుని శిలాశాసనాలు)
మెదక్ జిల్లా
రంగారెడ్డి జిల్లా
  • గాజులబండ
గుంటూరు జిల్లా
ప్రకాశం జిల్లా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
వైఎస్ఆర్ జిల్లా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి